ఏపీలో ప్రతీ నియోజకవర్గంలోనూ హోరా హోరీ పోటీ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ, బీజేపీ, సీపీఎం అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మ తనూజ రాణి, బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత, సీపీఎం అభ్యర్థిగా పాచిపెంట అప్పలనరస బరిలో ఉన్నారు. అయితే టీడీపీ, , జనసేన, బీజేపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతపై అరుకు గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒక సారి ఎంపీగా ఎన్నికైన గీత తమను పట్టించుకోలేదన్న విమర్శలు గట్టిగా ఉన్నాయి.
వైసీపీ నుంచి అరకు ప్రస్తుత ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు డాక్టర్ గుమ్మ తనూజా రాణి పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ది తనూజ రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం ఆ పార్టీకి కాస్త మైనస్ గా చెప్పుకోవచ్చు. సీపీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న పి. అప్పలనర్స ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది.
అల్లూరి జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికలలో ఈ మూడు నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం అరకు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా రేగం మత్స్యలింగం, కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పాంగి రాజారావు పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ అభ్యర్థికి టీడీపీ వర్గాలు సహకరించే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. టీడీపీలో ఉండి టికెట్ ఆశించిన దొన్నుదొర.. తాను ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అటు వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం పార్టీలో గ్రూపుల తగాదాలను తీర్చలేక సతమతమవుతున్నారు.
ఇటు ఇండియా వేదిక తరఫున కాంగ్రెస్ నుంచి శెట్టి గంగాధర స్వామి పోటీ పడుతున్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు.. సివేరి అబ్రహం కూడా ఓట్లను చీల్చడంలో ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇతనికి టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. దీంతో పాడేరులో ముగ్గురు అభ్యర్దుల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు అయింది. అటు పాడేరులో టీడీపీ అభ్యర్దిని మార్చుతారని..అప్పుడు గిడ్డి ఈశ్వరికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రంపచోడవరం నియోజకవర్గం విషయానికి వస్తే.. మిరియాల శిరీషా దేవిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగు ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి మరోసారి బరిలో దిగుతున్నారు. అయితే ఆమెపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో..అల్లూరి జిల్లాలో ఈ సారి ఎవరు అసెంబ్లీలోకి అడుగుపెడతారు? పార్లమెంటులో ఎవరు తమ గళం విప్పుతారనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY