టాలీవుడ్ను వరుస మరణాలు వెంటాడుతున్నాయి. తాజాగా చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత వల్లభనేని జనార్దన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా వల్లభనేని జనార్దన్ ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు అల్లుడు అన్న సంగతి తెలిసిందే. బాపినీడు మూడవ కుమార్తెను జనార్దన్ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా.. చిన్నవయసులోనే మొదటి కుమార్తె శ్వేత మృతి చెందింది. ఇక రెండవ కుమార్తె అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతుండగా.. కుమారుడు అవినాశ్ అమెరికాలో స్థిరపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గ్యాంగ్ లీడర్’, బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీ నరసింహ’, నాగార్జున హిట్ ఫిల్మ్ ‘వారసుడు’, వెంకటేష్ నటించిన ‘సూర్య ఐపీఎస్’ వంటి వాటిల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. జనార్దన్ తన కెరీర్లో 100 కి పైగా చిత్రాలలో నటించారు. అలాగే ఋతురాగాలు, అన్వేషిత వంటి పలు సీరియల్స్లో కూడా నటించారు. జనార్ధన్ నటుడే కాకుండా ప్రముఖ రచయిత కూడా కావడం గమనార్హం. ఇక వల్లభనేని జనార్ధన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా ఇటీవలికాలంలో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సీనియర్ నటులు రెబెల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు తదితరులు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE