ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి రాత పరీక్షలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఆగస్టు 12, బుధవారం నాడు రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి, వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తొలిరోజే 4.5 లక్షల మంది వరకు పరీక్షలు రాసే అవకాశముందని మంత్రి తెలిపారు.
3 వేల నుంచి 5 వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి, కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. మరోవైపు పశుసంవర్థక అసిస్టెంట్ పోస్టుల భర్తీపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu