ఐదు వేల రూపాయలకు ఉద్యోగమా..? అదీ ఒక ఉద్యోగమేనా? వంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను ఉద్దేశించి చాలాసార్లు వినిపించాయి. వాలంటీర్లు అంటే కొందరు చిన్నచూపు చూశారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ వారిని ప్రసన్నం చేసుకోవడానికి తహతహలాడుతున్నాయి. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, ధనబలం, కులబలం ఉన్న నేతలు ఎందరు ఉన్నా.. వాలంటీర్ ను కూడా ప్రసన్నం చేసుకోవాలని కొందరు.. ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసుకోవాలని మరికొందరు.. ఇలా ప్రతి రాజకీయపార్టీ.. వారి గురించి ఆలోచిస్తూనే ఉంది. వారిని ఆకట్టుకునేలా తాయిలాలు ప్రకటిస్తూనే ఉన్నారు. అధికార పార్టీ నేతలైతే.. ఆల్రెడీ తాయిలాలు ఆశచూపుతూ.. వారితో అప్పుడప్పుడూ సమావేశాలు అవుతూనే ఉన్నారు. తమ చేజారిపోకుండా.. ఎప్పటికప్పుడు వారితో భేటీలు అవుతూ స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను తెలుసుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 50 ఇళ్లకు ఒకరిని చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. అందులో కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ సుమారు 2.50 లక్షల మంది వాలంటీర్లు ఏపీలో ఉన్నారు. వారే మా సైన్యం.. అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థపై చిర్రుబుర్రులాడిన ప్రతిపక్షం కూడా.. ఇప్పుడు వారిని ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ విషయంలో టీడీపీ ఆచి తూచి వ్యాఖ్యానిస్తోంది. ఈ వ్యవస్థ ప్రజల్లోకి వెళ్లిపోవడం.. ప్రజలంతా కూడా ప్రభుత్వం అంటే.. తమ కళ్ల ముందు కనిపించే వాలంటీర్లపై విశ్వాసం పెంచుకున్న నేపథ్యంలో చంద్రబాబు నుంచి కీలక నేతల వరకు కూడా వారి గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఈ వ్యవస్థను తీసేయబోమని.. మరింత ఉన్నతీకరి స్తామని వారు చెబుతున్నారు.
నారా లోకేష్ అయితే.. వాలంటీర్లకు మెరుగైన జీతం కూడా ఇస్తామన్నారు. రాజకీయాల్లో అందరి కంటే.. రెండాకులు ఎక్కువే చదివిన చంద్రబాబు అయితే.. వాలంటర్లీపై ఎనలేని ప్రేమ చూపుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారికి రూ. 20 వేల నుంచి 30 వేల ఆదాయం సంపాదించే అవకాశాలు కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. అంతేకాదు.. పొరపాటున టీడీపీ నాయకులు ఎవరైనా.. వాలంటీర్లను ఉద్దేశించి తప్పుగా మాట్లాడినా… అవి వారి వ్యక్తిగతం.. పార్టీకి సంబందం లేదు.. అంటూ అధినాయకులు కవర్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పింఛన్ల పంపిణీలో వాలంటీర్ల ప్రమేయాన్ని ఈసీ నిలుపుదల చేయడంపై అధికార, విపక్ష పార్టీల మధ్య సాగుతున్న రగడ తెలిసిందే. అందుకు కారణం మీరంటే.. మీరంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
మొత్తంమ్మీద రూ. 5 వేలు సంపాదించే ఓ చిరుద్యోగి.. ఈ ఎన్నికల్లో కీలకంగా మారడాన్ని బట్టి చూస్తే.. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎంత బలోపేతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల విశ్వాసాన్ని ఎంత చురగొన్నారో తెలుసుకోవచ్చు. ఎన్నికల సందర్భంగా వాలంటీర్లకు అందే ప్రయోజనాలను పక్కనబెడితే.. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా.., ఈ వ్యవస్థ జోలికి వెళ్లే పరిస్థితి లేదని మాత్రం అర్థం అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY