అభివృద్ధికి అవకాశాలున్నా.. పాలకులు నిర్లక్ష్యం వహిస్తే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం పెందుర్తి నియోజకవర్గం. విశాఖపట్టణం నగరపాలక సంస్థ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంటుంది. వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం పెందుర్తి. విశాఖపట్టణం మహానగరానికి సమీపంలో ఉన్నప్పటికి ఈ నియోజకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పెందుర్తి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక్కడి ఎమ్మెల్యే ఎటువంటి చొరవ చూపించలేదు.
పెందుర్తి నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలతో పాటు పెదగంట్యాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. 2లక్షల 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. పేరుకు నగరానికి సమీప నియోజకవర్గం అయినా.. ఉన్నత విద్య, మెరుగైన వైద్య సేవల కోసం విశాఖపట్టణానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఉపాధి ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉంది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు.
ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పంచ గ్రామాల భూ సమస్య ఈ నియోజకవర్గంలో ప్రధానమైనది. ఈ సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్ 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇప్పటికీ పరిష్కరించలేదు. పరిశ్రమల ఏర్పాటు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు. పరవాడ ఫార్మాసిటీ కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం బారిన పడిన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.
2019 ఎన్నికల్లో పెందుర్తి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి అదీప్ రాజ్ ఎన్నికయ్యారు. ఆయన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేకంగా ఎటువంటి నిధులు తీసుకురాలేదు. ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టలేదు. పెందుర్తిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకాలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. మరోసారి ఇక్కడి ప్రజలను మోసం చేసేందుకు వైసీపీ అభ్యర్థిగా అదీప్ రాజు పోటీ చేస్తున్నారు.
ఈ నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షిస్తూ టీడీపీ, బీజేపీ బలపర్చిన జనసేన అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నేత పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పంచకర్ల రమేష్బాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ప్రజలు ఏ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినా సానుకూలంగా స్పందిచే వ్యక్తిత్వం పంచకర్ల రమేష్ బాబుది. పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యమంటూ ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు ప్రచారాలలో దూసుకుపోతున్నారు. మరి పెందుర్తి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY