ఏపీలో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా ఆరో జాబితాను విడుదల చేశారు. అయితే మొదటి, రెండు జాబితాలలో ఊహించని విధంగా అసంతృప్త రాగాలు ఎక్కువ వినిపించడంతో..తర్వాత విడుదల చేసిన జాబితాలను ఆచి తూచి విడుదల చేస్తున్నారు. అభ్యర్ధులను ప్రకటించి అందరి కంటే ముందుగా ప్రచారంలో దూసుకుపోదామన్న జగన్ ఆలోచనలకు ..అసంతృప్త రాగాలు అడ్డుకట్ట వేసినట్లు అయింది.
అయిదు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన సీఎం జగన్..ఆరోవిడుతను కూడా రిలీజ్ చేయడంతో.. మొత్తంగా 75 అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించినట్లు అయింది. 4 లోక్సభ స్థానాలు, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఈ ఆరో జాబితాలో అత్యంత ప్రతిష్ఠాత్మకం, కీలకంగా మారిన నర్సాపురం, గుంటూరు లోక్సభ స్థానాలతో పాటు.. రాజమండ్రి, చిత్తూరు (ఎస్సీ రిజర్వుడ్) లోక్సభ స్థానాలకు కూడా ఇన్ఛార్జీలను నియమించింది వైసీపీ.
వైసీపీలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన రఘురామ కృష్ణంరాజు.. ప్రాతినిథ్యం వహిస్తోన్న నర్సాపురం లోక్సభ స్థానానికి అడ్వకేట్ గూడూరి ఉమాబాల ఇన్ఛార్జీగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో నర్సాపురం సీటు నుంచి రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుండగా..రఘురామపై మహిళా అభ్యర్థిని నిలబెట్టడం హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం టీడీపీ జెండా ఎగురుతున్న గుంటూరు లోక్సభ ఇన్ఛార్జీగా ఉమ్మారెడ్డి వెంకటరమణను వైసీపీ అధినేత జగన్ నియమించారు. అలాగే రాజమండ్రికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, చిత్తూరుకు ఎన్ రెడ్డెప్ప పేర్లను జగన్ ఖరారు చేసారు. కృష్ణా జిల్లా మైలవరం ఇన్ఛార్జీగా సర్నాల తిరుపతిరావు యాదవ్ను నియమించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఇన్ఛార్జీగా అన్నా రాంబాబు, గిద్దలూరు- కే నాగార్జున రెడ్డిని జగన్ ఖరారు చేశారు.
మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గంపై సీఎం జగన్ మరోసారి ప్రయోగానికి దిగారు. గతంలో బీసీలకు కేటాయించిన నెల్లూరు స్థానాన్ని ఈసారి మైనారిటీలకు ఇచ్చింది. డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు కె.నారాయణ స్వామి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి బుట్టా రేణుకను నియమించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE