తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ భావిస్తుంది. అయితే సిట్టింగులకి ఈ సారి టికెట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో పాటు.. మరోవైపు కొత్తవారు కూడా టిక్కెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లోక్ సభ సీట్ల కేంద్రంగా తెలంగాణ బీజీపీలో హాట్ హాట్గా చర్చలు సాగుతున్నాయి..
లోక్ సభ ఎన్నికలలో డబుల్ డిజిట్ లక్ష్యంగా కమలం పార్టీ నేతలు పని చేస్తున్నారు. దీంతోనే గెలుపు గుర్రాల వేటలో బీజేపీ అధిష్టానం సీరియస్గా పావులు కదుపుతోందట. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతో పాటు ఇటీవల నిర్మించిన రామమందిర నిర్మాణం పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం తమ పార్టీకి ప్లస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు. దీంతోనే తమకు టికెట్ ఇస్తే ఎలా అయినా విజయం సాధిస్తామంటూ కొంతమంది ఆశావాహులు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.
పార్లమెంటు ఎన్నికల కోసం సిట్టింగ్ స్థానాలతో పాటు రిజర్వ్డ్ స్థానాలకు కూడా పోటీ ఎక్కువగా ఉందని..కొత్తవారు కూడా తమకు అవకాశం కల్పించాలని లాబీయింగ్లు ముమ్మరంగా చేస్తున్నారని కమలం పార్టీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందులో ఒక్క సికింద్రాబాద్ తప్ప మిగిలిన మూడు స్థానాలకు ఇప్పటికే కొంతమంది ఆశావాహులు కర్చీఫ్లు వేసేసారట.
మరోవైపు నిజామాబాద్ సిట్టింగ్ స్థానాన్ని మార్చి.. ఈ సారి తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ కొంతమంది నేతలు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అరవింద్ ఏకపక్ష నిర్ణయాలతో కమలం పార్టీని డ్యామేజ్ చేస్తున్నారంటూ ఇప్పటికే ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసిందట. ఆ స్థానాన్ని తమకు ఇమ్మని.. యండల లక్ష్మీనారాయణ, అల్జపూర్ శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు సీనియర్లు సీరియస్గా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అంతేకాదు కరీంనగర్ సీటు కోసం ఓ మీడియా సంస్థ అధినేత కూడా ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారట. బండి సంజయ్కు ఈ సారి సీటు ఇవ్వొద్దని ఆయన వ్యతిరేక వర్గం ఢిల్లీ పెద్దలు ముందు ఇప్పటికే ఫిర్యాదు చేశారట. ఆదిలాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొన్నట్లు తెలుస్తోంది. అక్కడి సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వొద్దని.. ముఖ్య నేతలు కొంతమంది అధిష్టానానికి చెబుతున్నారట. దీంతో తెలంగాణ బీజేపీలో పార్లమెంటు ఎన్నికల కోసం రసవత్తర పోటీ జరగడం మంచిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE