ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి కాక రేపుతోంది. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నట్లు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార వైసీపీ, తెలుగు దేశం పార్టీలు.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి.. ముందు వెనుక పరిశీలించి అడుగులు ముందుకు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి.
ఇన్నికలకు ఇంకా మూడు నెలల గడువు మాత్రమే ఉంది. ఈక్రమంలో తమ అభ్యర్థులను కాస్త ముందుగానే ఎన్నికల బరిలోకి దింపాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారట. కనీసం రెండు నెలల ముందు నుంచే అభ్యర్థులను ప్రజలకు దగ్గరగా ఉంచడం ద్వారా.. సానుకూల ఫలితాలు వస్తాయని జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్లను మార్చిన జగన్.. మరో 50 మందిని కూడా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో కొత్త ఇంఛార్జ్ల రెండో జాబితాను కూడా జగన్ ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇక రెండో జాబితా ప్రకటించిన వెంటనే వీలైనంత త్వరగా.. అన్ని స్థానాలకు అభ్యర్థులను జగన్ ఖరారు చేయనున్నారట. ఎలాగైనా జనవరి నెలాఖరులోగా 175 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని చేస్తున్నారట. ఈ నెలాఖరిలో జగన్ భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారట. ఆ సభలోనే తమ అభ్యర్థుల జాబితాను జగన్ ప్రకటించబోతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి తెలుగు దేశం పార్టీ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తోన్న విషయం తెలిసిందే. వైసీపీని ఢీ కొట్టడమే లక్ష్యంగా జనసేనతో తెలుగు దేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల సర్దుబాటు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వారం పది రోజుల్లో జనసేనకు కేటాయించిన సీట్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
అయితే వైసీపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాతే.. టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ జాబితా వచ్చాక అభ్యర్థుల బలాబలగాలు, సామాజిక నేపథ్యంతో పాటు ఇతరత్రా అంశాలను పరిశీలించి.. వారికి ధీటైన నేతలను రంగంలోకి దింపాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. గతంలో అందరికంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ.. ఇప్పుడు తన డెసిషన్ మార్చుకున్నారట. వైసీపీ జాబితా వచ్చాకే తమ జాబితాను ఫైనల్ చేయాలని చూస్తున్నారట. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయనేది చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE