ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో కాపు రిజర్వేషన్స్ పై, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వైసీపీ నేతలు కాపు రిజర్వేషన్స్ పై తనను విమర్శిస్తున్నారని, ఆ అంశం పై మాట్లాడే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు స్పీకర్ ని కోరారు. చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 10 శాతం ఓబీసీలకు రిజర్వేషన్స్ ప్రకటిస్తే, టిడిపి ప్రభుత్వం హామీకు కట్టుబడి అందులో 5 శాతం కాపులకు కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. కాపు రిజర్వేషన్స్ అంశం ఎప్పటినుంచో ఉందని, సామాజిక న్యాయానికి కట్టుబడి కాపులకు రిజర్వేషన్స్ తెచ్చామని, వారికీ కేటాయించిన 5 శాతం పై వైసీపీ ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని కోరారు.
ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ, చంద్రబాబు కాపులను మోసం చేసాడని, కొన్ని సాధ్యం కాదని తెలిసినా కూడ, రిజర్వేషన్స్ విషయంలో కాపులను అడుగడుగునా మోసం చేసాడని విమర్శించారు. మోసం చేయడం, అబద్దాలు ఆడడం తనకు రావని, ఏదైనా చేయగలిగితేనే మాట ఇస్తాను తప్ప,మోసం చేయడం తన నైజం కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం ఓబీసీ రిజర్వేషన్స్ మనకు ఇష్టమొచ్చినట్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. చంద్రబాబుకు సీట్లు తగ్గడం కూడ, కాపులకు చేసిన మోసమే కారణమని ఎద్దేవా చేసారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్టంలో 50 శాతానికి మించి రిజర్వేషన్స్ ఉండకూడదని, అన్ని విషయాలు తెలిసి కూడ కాపులను చంద్రబాబు మోసం చేసారని చెప్పారు. తెదేపా హయాంలో కాపులకు బడ్జెట్ లో నిధులు కేటాయించి, ఖర్చు చేయకుండా వదిలేశారని, కానీ ప్రస్తుత బడ్జెట్లో కాపులకు రూ. 2000 కోట్లు కేటాయించామని తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=iXD63oA3IQI]