ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 23, శుక్రవారం నాడు వరుసగా మూడో ఏడాది “వైఎస్ఆర్ చేయూత” పథకం నిధులను విడుదల చేశారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో జరిగిన వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, బటన్ నొక్కి నేరుగా 26,39,703 మంది మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.18,500 చొప్పున రూ.4,949.44 కోట్లు జమ చేశారు.
ముందుగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత గల మహిళలకు ఏపీ ప్రభుత్వం చేయూతను అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన మహిళలకు ప్రతి ఏడాది రూ.18,750 చొప్పున నాలుగు ఏళ్లలో మొత్తంగా రూ.75 వేలు అందజేయనున్నారు. ఈ రోజు అందిస్తున్న రూ.4,949.44 కోట్లతో కలిపి మొదటి, రెండు, మూడో విడతల్లో రాష్ట్రంలో అర్హులైన మహిళలకు రూ.14,110.60 కోట్ల అందజేయగా, ఒక్కో మహిళకు రూ.56,250 లబ్ధి చేకూరింది.
మరోవైపు సీఎం హోదాలో వైఎస్ జగన్ కుప్పంలో పర్యటించడం ఇదే తొలిసారి. ముందుగా కుప్పం పర్యటనలో విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్ కు రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కోనేటి అదిమూలం, బియ్యపు మధుసూధన్ రెడ్డి, మేడా మల్లికార్జున్, తిరుపతి జిల్లా కలెక్టర్ కే.వెంకటరమణ రెడ్డి, పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాప్టర్ లో కుప్పం చేరుకున్నారు. కుప్పం చేరుకున్న సీఎంకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి స్వాగతం తెలిపారు. ఆతర్వాత వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదు జమ వేదిక వద్దకు చేరుకుని, లబ్ధిదారు మహిళలతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ప్రజలనునుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. మరోవైపు 66 కోట్లతో కుప్పం మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అలాగే రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY