ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21 నాడు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న చేనేతల కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.24 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకం కోసం ఇంకా పేర్లను నమోదు చేసుకోని చేనేత కార్మికులకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు చేనేత, జౌళీ శాఖ సహాయ సంచాలకుడు కె. అప్పారావు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో దరఖాస్తు చేసుకోని చేనేత కార్మికులు ఇబ్బంది కలగకుండా, వారి సౌలభ్యం కోసం జనవరి 20 తేదీ వరకు గడువు పెంచుతున్నట్టు పేర్కొన్నారు. పథకం విధివిధానాల ప్రకారం అర్హులైన చేనేత కార్మికులు వారి దరఖాస్తులను 20వ తేదీలోగా తమకు అందజేయాలని ఆయన సూచించారు. ఇదివరకే నమోదు చేసుకున్నవాళ్ళు సాంకేతిక సమస్యలు ఏమైనా ఎదుర్కుంటుంటే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్పుస్తకం జిరాక్సులను మరోసారి అందజేయాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
[subscribe]