కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ చేపట్టాలని భావించగా, గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ నేతలను బయటకు రానివ్వకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలంతా సత్యాగ్రహ దీక్షకు దిగారు. గాంధీభవన్ లో 24 గంటలపాటు దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఇతర కాంగ్రెస్ నేతలు దీక్షలో కూర్చున్నారు.
ముందుగా కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను ఉత్తమ్కుమార్రెడ్డి వివరించారు. 135 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలియజేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బతిందని ఉత్తమ్ ఆరోపించారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, పౌరసత్వసవరణ చట్టం(సీఏఏ) వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.
[subscribe]