135వ ఆవిర్భావదినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారంనాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్ లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు ఏకే ఆంటోనీ, మోతీలాల్ వోహ్రా, ఆనంద్ శర్మ, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో ‘సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్’ సందేశంతో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు నిర్వహిస్తోంది.
‘అన్ని విషయాలకు మించి దేశం కోసం త్యాగం చేయడానికే కాంగ్రెస్ పార్టీకి విలువనిస్తుందని, ఆవిర్భావాన్ని మొదలుకుని భారత స్వాతంత్ర్య ఉద్యమం మరియు రాబోయే అన్ని రోజుల్లో కూడా భారతదేశమే పార్టీకి మొదటి ప్రాధాన్యత అని’ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. సంవత్సరాల నుండి నిస్వార్ధంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన కార్యకర్తలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నామని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అలాగే కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వసవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు అస్సాంలోని గుహవటిలో చేపట్టే ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. మరోవైపు లక్నోలో జరిగే ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యుపిపిసిసి) సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించనున్నారు.
[subscribe]