వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండవ రోజు సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ‘ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం’ తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సంచలన ప్రసంగం చేశారు. ప్లీనరీ ప్రసంగంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎవరికీ భయపడడని, తండ్రి వైఎస్ఆర్ మరణించిన నాటినుంచి ప్రజలకోసం ఒంటరిగానే పోరాటం చేస్తున్నాడని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిననాటినుంచే ఆయనపై ప్రతిపక్షాలు, పలు మీడియా సంస్థలు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పేద పిల్లలు కూడా బాగా చదువుకుని ప్రయోజకులవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే వీరు విమర్శలు చేస్తున్నారని, ఈ విమర్శలు చేస్తున్నవారి పిల్లలు ఏ మీడియంలో చదివారని ప్రశ్నించారు. ఇక సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తున్నారని, పెన్షన్లు కూడా ప్రతి ఏడాది పెంచుతూ పోతున్నారని, అధికారం చేపట్టిన మూడేళ్ళలోనే 95 శాతం హామీలను అమలుచేసిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
ఇక ఇదే అంశంపై మరో మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేయడానికే ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్ని ధిక్కరించి సొంతంగా పార్టీ పెట్టారని వివరించారు. 16 నెలల పాటు జైల్లో పెట్టినా వెనకడుగు వేయలేదని తెలిపారు. ఆయన సంకల్పం గొప్పదని, అందుకే ఆయనను ఎవరూ ఆపలేకపోయారని అన్నారు. నాలాంటి వారు వస్తుంటారు, పోతుంటారు.. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు, జెండా మోసే కార్యకర్తలు మాత్రమే శాశ్వతమని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, అలాంటి నాయకుడి కోసం పార్టీ నాయకులందరూ కలిసి పని చేయాలని సూచించారు. కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో, లేదో తెలుసుకోవాలని చెప్పారు. ఒకవేళ ఎవరికైనా ఈ పథకాలు అందనట్లైతే చొరవచూపి తప్పులను సరిదిద్దాలని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని సీఎం చెప్పారని గుర్తు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ