తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని స్వయంగా చూసి తెలుసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న ప్రియాంక గాంధీని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ప్రియాంక గాంధీని పొలిటికల్ టూరిస్ట్గా అభివర్ణించారు. యువతను రెచ్చగొట్టేందుకు తెలంగాణకు రావడం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేస్తోందని, దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయలేని పనిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని తెలిపారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని పేర్కొన్న ఆయన.. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలను ఇచ్చింది? అని ప్రియాంక గాంధీని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో 2.2 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని, అలాగే ప్రయివేటు రంగంలో మరో 22 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని, ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ‘యువ సంఘర్షణ సభ’ పేరుతో తెలంగాణకు వస్తున్న ప్రియాంక గాంధీ ఆ పార్టీ నాయకులు రాసిచ్చే స్క్రిప్ట్ కాకుండా.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూసి మాట్లాడాలని కోరారు. హైదరాబాద్ నగరం ఎంతగా అభివృద్ధి చెందిందో.. ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి ప్రముఖులే చెబుతున్నారని, కావాలంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నేతలనే అడగొచ్చని అన్నారు. గాంధీభవన్ను గాడ్సే లాంటి వారికి అప్పగించి కాంగ్రెస్ స్వయంగా తన అంతానికి తానే వీలునామా రాసుకొన్నదని, సోనియా గాంధీని నాడు బలిదేవత అని అభివర్ణించిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాటలకు ముందు సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE