ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతూ పోతుంది. ఏప్రిల్ 6 సోమవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కరోనా వ్యాప్తి నివారణపై సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితులను అధికారులు సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 266 కేసుల్లో ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన వారే 243 మంది ఉన్నారని తెలిపారు. ఢిల్లీకి వెళ్లినవారు, అలాగే వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి దాదాపుగా పరీక్షలు పూర్తయ్యాయని, అనంతరం ఇంటింటి సర్వే నిర్వహించి ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికీ కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభావ ప్రాంతాలను రెడ్జోన్లగా ఎంచుకుని, క్లస్టర్లు విభజించి అక్కడకూడా ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
కరోనా పరిస్థితులపై అధికారుల వివరణ అనంతరం సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ, రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షలకు సరిపడా టెస్టు కిట్లను తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్వారంటైన్లు, ఐసోలేషన్ కేంద్రాల్లో బాధితుల సదుపాయాలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని స్పష్టంచేశారు. ఐసీయూలలో బెడ్లకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని చెప్పారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో టమోటా, చీనీ, బత్తాయి, అరటి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూదన్నారు. అదేవిధంగా 1902కు వచ్చే కాల్స్ పై కూడా దృషిసారించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.