బాహుబలి సృష్టించిన సంచలనాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 70 శాతం వరకు పూర్తయిందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుందని గతంలోనే ప్రకటించారు. తాజాగా బుధవారం నాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ను చిత్ర బృందం ప్రకటించింది. హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్కు జోడిగా జెన్నీఫర్ పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒలీవియా మోరిస్ పలు టీవీ షోస్ లో నటించింది.
ఇక మెయిన్ విలన్ స్కాట్ పాత్రను హాలీవుడ్ నటుడు రే స్టీవ్సన్ పోషిస్తున్నట్టు ప్రకటించారు. థోర్, డైవర్జంట్ సిరీస్ లతో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, టీవీ సిరీస్ లలో రే స్టీవ్సన్ నటించాడు. మరో ప్రధాన విలన్ లేడీస్కాట్ పాత్రలో ఐరిష్ నటి అలిసన్ డూడీ నటిస్తున్నారు. చిత్రబృందం వీరి ముగ్గురు ఫోటోలను షేర్ చేస్తూ భారతీయ చిత్రపరిశ్రమకు స్వాగతం చెబుతున్నట్లు పేర్కొన్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై, రాజమౌళి దర్శకత్వంలో భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.