తెలంగాణలో గత 47 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఎట్టకేలకు విరమించే దశకు చేరుకుంది. నవంబర్ 20, బుధవారం నాడు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైకోర్టు తీర్పు, సమ్మె కొనసాగింపుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు, షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ప్రకటించారు. రెండు వారాలలోపు కార్మిక న్యాయస్థానంలో సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామని, కార్మిక న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు.
సమ్మె చేపట్టడానికి ముందు అక్టోబరు 4న ఎలాంటి వాతావరణం ఉందో, అలాంటి ప్రశాంత వాతారణంలోనే ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఎటువంటి రాతపూర్వక హామీలు ఇవ్వకుండా, హాజరు పట్టికలో మరియు డ్యూటీ చార్టుపై మాత్రమే సంతకాలు చేస్తామని చెప్పారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామని చెప్పారు. సమ్మె చేసింది కేవలం ఆర్టీసీ పరిస్థితిని బాగుచేసేందుకేనని, కోర్టు తీర్పు తర్వాత కూడ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రజలు, కార్మికుల దృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సమ్మె సందర్భంగా మనోవేదనతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. సమ్మె విరమించడానికి కార్మికులు సంఘాలు సిద్దపడడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
[subscribe]