టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్య నటుడు కడలి జయసారథి కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేటు ఆస్పత్రి (సిటీ న్యూరో)లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కాగా ఆయనకు 83 సంవత్సరాలు. ఇక సారధి దాదాపు 370 పైచిలుకు చిత్రాల్లో నటించారు. చిత్రపరిశ్రమలో ‘జగన్మోహిని’ సారథిగా ఆయన సుపరిచితులు. ఆయన పేరు తెలియని వారు ఉంటారేమో కానీ, ముఖ్యంగా ‘జగన్మోహిని’ సినిమాలో ఆయన పోషించిన పాత్ర మాత్రం చాలామందికి గుర్తుండే ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో 1942 జూన్ 26న జన్మించిన జయసారథి సినిమాలపై అమితాసక్తితో చెన్నై చేరుకొని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తొలితరం తెలుగు అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంతో 1961లో వెండితెర అరంగేట్రం చేశారు. అనంతరం ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రధానంగా హాస్యపాత్రలు పోషించడంలో సారథిది ప్రత్యేక శైలి. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్కు తరలి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడిగా క్రియాశీలకంగా పనిచేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా విశేష కృషి చేశారు సారధి.
సీతారామ కళ్యాణం, పరమానందయ్య శిష్యుల కథ, భక్త కన్నప్ప, జగన్మోహిని, మన ఊరి పాండవులు, కోతల రాయుడు, నాయకుడు–వినాయకుడు, ఆస్తులు అంతస్తులు, శారద, అమరదీపం, ముత్యాల ముగ్గు, కృష్ణవేణి, అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న, డ్రైవర్ రాముడు వంటి పలు హిట్ సినిమాలలో సారథి తన అభినయంతో ప్రేక్షులను అలరించారు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజుకు సన్నిహితుడైన సారథి వారి సొంత నిర్మాణ సంస్థ ‘గోపికృష్ణ’ బ్యానర్లో నిర్మించిన అనేక సినిమాలను ఆయన పర్యవేక్షించేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. కాగా జయసారథి అంత్యక్రియలు నేటి మధ్యాహ్నాం 2 గంటలకు ‘మహా ప్రస్థానం’లో జరుగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY