ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో బ్రిటన్ లోనే అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్ లో గత 24 గంటల్లో 90,418 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు భారీగా ఉండడం అక్కడి ప్రభుత్వాన్ని, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కరోజులోనే 10 వేల ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగు చూడటం గమనార్హం. ఒమిక్రాన్ తో మరణించిన వారి సంఖ్య కూడా పెరిగింది. ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం బ్రిటన్ లో సంభవించడం తెలిసిందే. కాగా, ఇప్పుడు తాజాగా మరో ఆరుగురు మరణించారు. ప్రస్తుతం అక్కడ క్రిస్మస్ సందడి నెలకొని ఉండటం.. దీనికితోడు మరికొన్ని రోజుల్లోనే నూతన సంవత్సరాది కూడా రానుండటంతో కేసులు ఏ స్థాయిలో విజృంభిస్తాయో ఊహించలేకపొతున్నారు.
ఇప్పటికే ఒమిక్రాన్ విలయతాండవం చేస్తుండటంతో బ్రిటన్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏం చేయాలో అర్ధంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ, లాక్ డౌన్ విధిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముందని భయపడుతున్నారు. క్రిస్మస్ పండుగ సమయం కావటంతో, క్రిస్మస్ ముగిసిన తర్వాత లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒమిక్రాన్ విజృంభణపై బ్రిటన్ ఆరోగ్యమంత్రి సాజిద్ జావిద్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, అయితే చాలా కేసుల్లో ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత లేకపోవడం ఊరటనిచ్చే విషయమని అన్నారు. కొన్ని కేసుల్లో వెంటిలేటర్ అవసరం కూడా ఉండటం లేదని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ