జమ్మూకశ్మీర్ లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు తాజాగా షాక్ తగిలింది. కాంగ్రెస్ ను వీడి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీలో చేరిన పలువురు నేతలు తిరిగి మళ్ళీ సొంత గూటికే చేరుకున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ పీర్జాదా మహ్మద్ సయీద్, మాజీ ఎమ్మెల్యే బల్వంత్ సింగ్ సహా 17 మంది నేతలు శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ రజనీ పాటిల్ సమక్షంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ జెండా కప్పుకున్నారు. అనంతరం వారంతా పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గులాబీ నబీ ఆజాద్ తో స్నేహం, భావోద్వేగాలు కారణంగానే పార్టీని వీడామని అన్నారు. మళ్ళీ సొంత పార్టీలోకి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ జనవరి 20వ తేదీ నుంచి జమ్మూకశ్మీర్ లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే పలువురు నేతలు పార్టీలోకి రావడంతో జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ మరింత పుంజుకుంటుందని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, అపార్థాల కారణంగా గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జమ్మూకశ్మీర్ లోని ప్రముఖులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కుటుంబంలో కలిశారన్నారు. భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన సందర్భం అని, ఇప్పుడు చూస్తున్న మార్పులు కేవలం ప్రారంభం మాత్రమేనని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE