ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో నిర్వహించిన “తబ్లిగీ జమాత్” కార్యక్రమం కారణంగా దేశంలోని 14 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏప్రిల్ 3, శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడచిన రెండు రోజుల్లోనే ఈ సమావేశానికి హాజరైన వారిలో 647 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో ప్రకటించారు. అలాగే దేశంలో గురువారం ఒక్కరోజే 336 కేసులు నమోదైనట్లు
తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2,301కి చేరిందని, ఈ వైరస్ వలన ఇప్పటికి 56 మంది ప్రాణాలు కోల్పోయారని లవ్ అగర్వాల్ తెలిపారు. గత 24 గంటల్లోనే 12 మంది మరణించారని పేర్కొన్నారు. చనిపోయిన వారిలో తబ్లిగీ జమాత్ సమావేశానికి వెళ్లిన వారు కూడా ఉన్నారని చెప్పారు. మరోవైపు కరోనా వైద్య పరీక్షల కోసం భారతదేశంలో మొత్తం 182 ల్యాబ్ లు పని చేస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. అలాగే ఏప్రిల్ 2 న 8345 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.
[subscribe]