నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముగిసింది. గడచిన రెండు రోజులుగా ఢిల్లీ లోని ఈడీ కార్యకాయంలో జరుగుతున్న విచారణకు ఆమె హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మూడోరోజు విచారణకు హాజరైన సోనియా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈడీ జారీ చేసిన సమన్ల గడువు నేటితో ముగిసినట్లయింది. ఒకవేళ ఈ కేసులో ఆమెను మళ్ళీ విచారణ జరపాలనుకుంటే, ఈడీ మరోసారి సోనియాకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది.
కాగా ఈ కేసులో ఇప్పటి వరకు సోనియాను ఈడీ మూడు రోజుల పాటు విచారించింది. ఈ సందర్భంగా 75 ఏళ్ల సోనియా మొత్తం 12 గంటల పాటు విచారణను ఎదుర్కోగా, అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ ఆమె చాలా వేగంగా సమాధానాలు ఇచ్చినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ మూడు రోజుల్లో మొత్తం 12 గంటల పాటు 100కు పైగా ప్రశ్నలను ఆమెకు ఈడీ సంధించింది. ఇక ఇదే కేసులో సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రాహుల్ను 5 రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆయనకు దాదాపు సుమారు 150 ప్రశ్నలు వేశారు.
ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బుధవారం కూడా పలు ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, తమను బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లోకి ఎక్కించినట్లు రాజస్థాన్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ ఆరోపించారు. అలాగే తనతో సహా మొత్తం 65 మంది ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ