భారత దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26, 2019 నాటికీ 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో పార్లమెంట్ సెంట్రల్ హల్ లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశ రాజ్యాంగం మనకు పవిత్ర గ్రంథమని, పౌరులుగా మన తీరు, వ్యవహారాలు రాజ్యాంగంతోనే ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం పౌరుల యొక్క హక్కులు మరియు విధులను కలిగిఉంటుందని, మన రాజ్యాంగంలో పేర్కొన్న విధులను ఎలా నెరవేర్చగలమో ఆలోచించాలని కోరారు. పటిష్టమైన గొప్ప రాజ్యాంగం కారణంగానే దేశప్రజలమంతా ఒక్కటిగా నిలిచామని కొనియాడారు. అలాగే 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున ముంబయిలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. మోదీ ప్రసంగం అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలు, దేశప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడ 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎస్.చౌహాన్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెలేలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని, దేశ, రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడం ప్రజల బాధ్యత అని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ సందర్భంగా హాజరైన సభ్యుల చేత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని గవర్నర్ ప్రమాణం చేయించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మనది డైనమిక్ రాజ్యాంగమని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని తెలిపారు. అలాగే అమరావతి లోని రాజ్భవన్లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఉన్నా కూడ మన హక్కులను మనం కాపాడుకోవాలని, అలాగే పౌరుడిగా బాధ్యతాయుతంగా ప్రాథమిక విధులను ఆచరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. అనంతరం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులతో గవర్నర్ ప్రమాణం చేయించారు.
[subscribe]