మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత మహారాష్ట్రలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ అవకాశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ మరియు శివసేన పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం సోమవారం నాడు విచారణ ముగించింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
నవంబరు 27న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష పూర్తి చేయాలని, బహిరంగ బ్యాలెట్ విధానంలోనే ఈ ప్రక్రియను నిర్వహించాలని స్పష్టం చేసింది. బలపరీక్ష పక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని కోర్టు పేర్కొంది. బలపరీక్షకు ముందే ప్రొటెం స్పీకర్ను నియమించి, ప్రభుత్వ బల నిరూపణ ఒక్కటే అజెండాగా పెట్టుకుని అసెంబ్లీలో సమావేశం జరగాలని సూచించింది. ముందుగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి, ఆ తరువాత ప్రొటెం స్పీకర్ బలపరీక్షను నిర్వహించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. బీజేపీ 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 స్థానాలు దక్కించుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పలు రకాల పరిణామాలతో సాగిన మహారాష్ట్ర రాజకీయం రేపటి బలపరీక్షతో అయిన కుదురుకుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
[subscribe]