8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (2022) ప్రదర్శన యొక్క ప్రధాన కార్యక్రమం జూన్ 21వ తేదీన కర్ణాటకలోని మైసూరులో నిర్వహించబడుతుందని కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ సోమవారం ప్రకటించారు. యోగా దినోత్సవం నాడు ప్రధాన కార్యక్రమమైన సామూహిక యోగా ప్రదర్శన కోసం వేదికగా మైసూరు ఎంపికైందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సామూహిక యోగా ప్రదర్శనకు నాయకత్వం వహిస్తారని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటుండడంతో దేశవ్యాప్తంగా 75 ప్రముఖ ప్రదేశాల్లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్లాన్ చేసిందని, మరియు ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని బ్రాండింగ్ చేయడంపై దృష్టి సారించిందని చెప్పారు.
మరోవైపు జూన్ 21న మైసూరులో జరిగే ప్రధాన కార్యక్రమమే కాకుండా విదేశాల్లోని భారతీయ మిషన్లు నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల డిజిటల్ ఫీడ్ని సంగ్రహించి, స్ట్రీమింగ్ చేయడం మరో ఆకర్షణగా నిలువనుందని పేర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు సూర్యోదయ భూమి అయిన జపాన్ నుండి స్ట్రీమింగ్ ప్రారంభించాలనేది ప్రతిపాదిత ప్రణాళికగా ఉందన్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నామని, మే 27న హైదరాబాద్ లో 25 రోజుల కౌంట్డౌన్ను నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 10 వేల మంది యోగా ఔత్సాహికులు ఈ యోగా ప్రదర్శనలో పాల్గొంటారని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు, యోగా గురువులు, యోగా అనుబంధ శాస్త్ర నిపుణులు, స్థానిక యోగా సంస్థలు మరియు యోగా ఔత్సాహికులు హాజరవుతారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF