తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే ‘మహానాడు’ కార్యక్రమ ఏర్పాట్లపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష చేపట్టారు. మే 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న ‘మహానాడు’ ఏర్పాట్లపై పార్టీ నేతలకు పలు సూచనలిచ్చారు. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా మహానాడు ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా అంశాలు ప్రతిబింబించేలా చూడాలని మహానాడు నిర్వాహక కమిటీలను కోరారు. మొదటి రోజున 12 వేల మందికి ఆహ్వానం ఇవ్వనున్నట్లు, రెండో రోజు అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటానికి నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, అయినా మహానాడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం టీడీపీ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మహానాడు కూడా విజయం సాధిస్తుందని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే మహానాడు జరుగనున్న రోజులలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షం కురిసే అవకాశం ఉందని.. ఒంగోలు మినీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీడీపీ అనుమతులు కోరింది. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసి అనుమతి నిరాకరించింది. అనంతరం ఒంగోలు పట్టణ సమీపంలోని మండవవారి పాలెం సమీపంలోని బృందావన్ ఫంక్షన్ హాల్ సమీపంలో పార్టీ వేదికను ఖరారు చేశారు. ఇప్పటికే మహానాడు కోసం మొత్తం 16 కమిటీలను ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో మహానాడు నిర్వహణ, సమన్వయ కోసం మొత్తం 145 మందితో కూడిన 16 కమిటీలను ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ