తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులు, సీట్ల పంపిణీపై కసరత్తు పూర్తిచేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) పార్టీ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది. ఈ థర్డ్ ఫ్రంట్ లో మరో ప్రముఖ నటుడు ఆర్.శరత్ కుమార్ యొక్క ఆల్ ఇండియా సమతువా మక్కల్ కచ్చి (ఎఐఎస్ఎంకె), ఇండియా జననాయక కచ్చి (ఐజెకె) పార్టీలు బాగస్వామ్యులుగా చేరాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎంఎన్ఎం 154 చోట్ల, ఎఐఎస్ఎంకె 40 చోట్ల, ఐజెకె 40 చోట్ల బరిలోకి దిగనున్నాయి. ఇందుకు సంబంధించి మూడు పార్టీల నాయకులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. తమిళనాడును ఉన్నతంగా మార్చాలనే లక్ష్యానికి ఈ పార్టీలు ఉమ్మడిగా కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.
ఏఎంఎంకేతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ పొత్తు:
మరోవైపు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ తమిళనాడు ఎన్నికల్లో కూడా పోటీకి దిగుతుంది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన కొత్త పార్టీ అమ్మ మక్కల్ మున్నేత్ర కజగమ్ (ఏఎంఎంకే) ఎంఐఎం పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా కృష్ణగిరి, శంకరపురం వాణియంబాడి వంటి మూడు స్థానాల నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ కి 20 అసెంబ్లీ స్థానాలతో పాటుగా, ఉపఎన్నిక జరగనున్న కన్యాకుమారి లోక్సభ స్థానాన్ని అన్నాడీఎంకే కేటాయించింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ కు 25 స్థానాలు, కన్యాకుమారి లోక్సభ స్థానం, సీపీఐకి 6 అసెంబ్లీ స్థానాలను ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కేటాయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ