కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ సినీనటి ఖుష్బూ సోమవారం నాడు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రతినిధిల సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ముందుగా ఈ రోజు ఉదయం ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖను ఖుష్బూ మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖలో ఆమె కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై విమర్శలు చేశారు. పార్టీలో పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు గ్రౌండ్ రియాలిటీతో కనెక్ట్ కాలేకపోతున్నారని, పార్టీ కోసం పనిచేస్తున్న తమలాంటివారిని అణిచివేస్తున్నారని ఆమె అన్నారు.
2010 లో డీఎంకే పార్టీలో చేరి ఖుష్బూ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నాలుగేళ్లు డీఎంకే లో ఉన్న ఆమె ఆ పార్టీని వీడి 2014 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకోలేకపోయారు. అనంతరం పార్టీలో పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన నేపథ్యంలోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బీజేపీ లో చేరిన తరువాత ఖుష్బూ మాట్లాడుతూ దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి పీఎం నరేంద్ర మోదీ లాంటి వారు అవసరమని కాలక్రమేణా గ్రహించాను అని పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu