ప్రముఖ కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణంతో కన్నడ సినీపరిశ్రమ సహా ఇతర సినీ పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పునీత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ పార్ధివదేహాన్ని బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు.
పునీత్ చివరిచూపు కోసం పలువురు టాలీవుడ్ హీరోలు కూడా బెంగళూరుకు చేరుకున్నారు. ముందుగా శనివారం ఉదయం అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంకు చేరుకొని పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ను హత్తుకుని ఓదార్చారు. తనకు, పునీత్ కు ఎంతో అనుబంధముందని చెప్పారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తామంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని, ఆ కుటుంబంతో తనకెంతో అనుబంధం ఉందని, దేవుడు ఎంతో అన్యాయం చేశాడనిపిస్తోందని బాలకృష్ణ అన్నారు.
అలాగే శనివారం మధ్యాహ్నం పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దర్శించుకుని నివాళులు అర్పించారు. పునీత్ భౌతికకాయాన్ని చూసి ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. పునీత్ కుటుంబ సభ్యులను ఎన్టీఆర్ పరామర్శించారు. మరోవైపు ఎన్టీఆర్ ను చూడగానే పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆదివారం నాడు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ