కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం బయటపడింది. పంజాబ్లోని హోషియార్పూర్ వద్ద యాత్ర కొనసాగుతున్న సందర్భంగా ఇది చోటుచేసుకున్నట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. అయితే ఇది భద్రత ఉల్లంఘనగా తాము పరిగణించడం లేదని వారు పేర్కొన్నారు. కాగా జలంధర్లో శనివారం జరిగిన జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరీ గుండెపోటుతో మరణించడంతో యాత్రను 24 గంటల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో యాత్ర తిరిగి సోమవారం జలంధర్ జిల్లా అదంపుర్ నుంచి ప్రారంభమైంది.
ఈ క్రమంలో యాత్ర మంగళవారం ఉదయం పంజాబ్లోని హోషియాపూర్ వద్దకు చేరుకున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి నడుస్తున్న సమయంలో ఎరుపు రంగు జాకెట్ ధరించిన ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఒక్కసారిగా రాహుల్ వైపుకు దూసుకొచ్చాడు. అంతేకాకుండా అతను రాహుల్ గాంధీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, ఇతర పార్టీ కార్యకర్తలు అప్రమత్తమై ఆయనను అడ్డుకుని తోసేశారు. అనంతరం రాహుల్ తన యాత్రను యథావిధిగా కొనసాగించారు. ఇక సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జనవరి 30 నాటికి శ్రీనగర్లో ముగియనుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
కాగా రాజధానిలో యాత్ర సందర్భంగా భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ, యాత్రలో పాల్గొనే రాహుల్ గాంధీ మరియు ఇతరుల భద్రతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ గత నెలలో హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. అయితే దీనికి సమాధానంగా.. కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చుతూ, నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాహుల్ గాంధీకి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే రాహుల్ 2020 నుండి 113 సార్లు భద్రతా ప్రోటోకాల్లను ఉల్లంఘించారని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ఘటన జరగడంతో కాంగ్రెస్ వర్గాలు రాహుల్ గాంధీ భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE