పొరుగు దేశం చైనాలో మళ్ళీ కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, లేని యెడల యాత్రను నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా లేఖ రాశారు. లేఖలో.. పాదయాత్ర సమయంలో మాస్క్లు మరియు శానిటైజర్ల వాడకంతో సహా కోవిడ్ ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే టీకాలు వేసిన వారిని మాత్రమే యాత్రలో పాల్గొనడానికి అనుమతించాలని రాహుల్ గాంధీకి తెలిపారు. ఒకవేళ ఈ కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరించలేకపోతే, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ మహమ్మారి నుండి దేశాన్ని రక్షించడానికి మరియు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ‘భారత్ జోడో యాత్ర’ని నిలిపివేయాలని అభ్యర్థిస్తున్నానని లేఖలో కోరారు.
ఇక కేంద్రమంత్రి లేఖపై కాంగ్రెస్ స్పందించింది. కర్ణాటక మరియు రాజస్థాన్లలో బిజెపి యాత్రలు చేస్తోందని, ఆరోగ్య మంత్రి వారికి కూడా లేఖలు పంపారా? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం దయచేసి కోవిడ్ ప్రోటోకాల్ను ప్రకటించాలని, తాము వాటిని తప్పనిసరిగా పాటిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా రాహుల్ జోడో యాత్ర బుధవారం హర్యానాలోకి ప్రవేశించింది. అనంతరం మరో మూడు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో ప్రవేశించనుంది. దీంతో దేశంలో మళ్ళీ కొన్ని కోవిడ్ నిబంధనలను విధించడాన్ని పరిశీలించడానికై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు పలువురు ఉన్నతాధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ