చదువులో సమానత్వం ఉంటేనే, సమాజంలో అంతరాలు తొలగుతాయని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఈ-ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలు, అధికారులు హాజరయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని, దీనిలో భాగంగానే నేటి కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4.59 లక్షల మందికి పైగా విద్యార్థులకు 5,18,740 ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ-లెర్నింగ్ సిస్టమ్ ద్వారా విద్యను సంప్రదాయ మోడ్ నుండి ఆధునిక మార్గాలకు మార్చడానికి చేసే ప్రయత్నాలలో ఇది భాగమని, అందుకే విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ఈ-ట్యాబ్లను అందజేస్తున్నామని వెల్లడించారు. మంచి విద్యతో పిల్లల తలరాతలు మారతాయని, అందుకే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ బోధనతో పాటు డిజిటల్ విద్యను అందించడానికి నిర్ణయించుకున్నామని తెలియజేశారు. ఇక విద్యార్థులతో పాటు మరో 66 వేల మంది టీచర్లకు కూడా ట్యాబ్లను అందిస్తున్నామని, మొత్తం 5,18,740 ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్స్ కోసం ప్రభుత్వం రూ.686 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఇకపై ప్రతి ఏటా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు ఇస్తామని, తద్వారా వారు ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసి సులువుగా నేర్చుకోగలుగుతారని సీఎం జగన్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ