బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. మద్యం తాగడం వలన సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని, అలాగే వారి కుటుంబీకులకు ఎలాంటి నష్ట పరిహారం కూడా చెల్లించబడదు అని స్పష్టం చేశారు. తద్వారా మద్యపానానికి వ్యతిరేకంగా ఆయన తన కఠినమైన వైఖరిని కొనసాగించారు. కాగా సరన్ జిల్లాలోని ఛప్రా ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి 50మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో దీనిపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఈరోజు సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం తాగి మరణించిన వ్యక్తులకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వబడదని, ప్రజలకు ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని, మద్యం తాగితే చనిపోతారని, దీంతో వారి మీద ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడుతుందని తెలిపారు. అయితే ప్రజలను త్రాగడానికి అనుకూలంగా మాట్లాడే వారు మీకు ఏ మేలు చేయరని గుర్తించాలని, ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వారికి ఎలాంటి నష్టపరిహారం అందించదని తేల్చి చెప్పడంతో ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి. అయితే సీఎం ప్రకటనపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. దేశంలోని అత్యంత సీనియర్ ముఖ్యమంత్రులలో నితీశ్ కుమార్ ఒకరని, అయితే ఈరోజు ఆయన చేసిన ప్రకటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని విపక్ష బీజేపీ మండిపడింది. ముఖ్యమంత్రి బాధ్యతగా వ్యవహరించడం లేదని, రాష్ట్రంలో మద్యపాన నిషేధ విధానాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మద్యం అమ్మకం మరియు వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధించిందని, అయితే దీని స్థానంలో కల్తీ మద్యం ప్రవహిస్తోందని, దీనిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన తప్పుని ఒప్పుకుని, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ