ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రం మాచర్లలో ప్రతిపక్ష పార్టీ చేపట్టిన “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. తమ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారని టీడీపీ ఆరోపించగా, ఘర్షణలో తమ కార్యకర్తలు కొందరు గాయపడ్డారని అధికార పార్టీ పేర్కొంది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మాచర్లలో పోలీసులు సీఆర్పీసీ 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో టీడీపీ నేత బ్రహ్మారెడ్డి తన కార్యాలయంగా, నివాసంగా వాడుకుంటున్న భవనంపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పల్నాడు, గుంటూరు జిల్లాల్లో హైటెన్షన్ నెలకొంది.
ఈ నేపథ్యంలో మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతోందని, మాచర్లలో చెలరేగిన ఈ మంటలు త్వరలోనే వైసీపీ ప్రభుత్వాన్ని దహిస్తాయని హెచ్చరించారు. ఇక మాచర్లలో తెలుగుదేశం శ్రేణులపై దాడులను పోలీసులు పట్టించుకోలేదని, అధికార పార్టీకి వారు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దాడి చేసిన వారిని వదిలేసి తెలుగుదేశం కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం, తిరిగి వారిపైనే కేసులు పెట్టడం ఏంటని? పోలీసులను ప్రశ్నించారు. సీఎం జగన్ అండతో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని, తమ పార్టీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై దాడి చేసి, ఆయనను అదుపులోకి తీసుకోవడంలో ఆంతర్యం ఏంటని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ దీనికి సమాధానం చెప్పాలని, వైసీపీ శ్రేణులకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ఘటనపై స్పందించారు. దీనికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ఎస్పీ ఆఫీస్కు వెళ్లి నిరసన తెలుపుతామని తీరుతామని స్థానిక టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. దీంతో గుంటూరులోని మాజీమంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇక సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరామ్ ‘ఛలో మాచర్ల’కు పిలుపునిచ్చిన క్రమంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలో ప్రస్తుతం పరిస్థిితి అదుపులో ఉందని, 144 సెక్షన్ విధించామని తెలియజేశారు. అలాగే ఈ ఘటనపై సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేేసే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని, ఇలాంటి పరిస్థితుల్లో బయటి వ్యక్తులు ఎవరూ మాచర్లకు రాకూడదని స్ఫష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ