జైలర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి మాంచి జోరు మీద ఉన్నారు సూపర్స్టార్ రజనీకాంత్. రోజురోజుకూ ఆయనకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇప్పుడా అభిమాన సంద్రంలోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. అవును ఇది నిజం. కాకపోతే తలైవాను పొలిటికల్ గా తమకు ఉపయోగించుకోవడానికి బీజేపీకి అభిమానం బాగా పెరిగిపోతోంది. ఆయనకు ఒక ఉన్నతమైన పదవిని అందించాలని బీజేపీ భావిస్తోంది. రజనీకాంత్కి గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా తమిళనాట లక్షలాదిగా ఉన్న రజనీకాంత్ అభిమానులను తమ వైపు తిప్పుకోవచ్చున్న కొత్త ఎత్తుగడతో రజనీవైపు చేతులు చాస్తోంది.
సౌతిండియాలో బీజేపీకి 2024 ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే ఈసారి ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయని, అదే సమయంలో సౌతిండియాలో ఉన్న 129 ఎంపీ సీట్లలో సగానికి సగం అయినా సొంతం చేసుకుంటే బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావచ్చని ఒక అంచనాగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. దిగ్గజ నేతలు కరుణానిధి, జయలలిత ఇప్పుడు లేరు. అందుకే తమిళనాట రజనీకాంత్ని తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ వేయని ఎత్తులు లేవు. రజనీని తమతో కలుపుకోవాలని చూసింది. అయితే రజనీ సొంతంగా పార్టీ పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన ఊగిసలాట ధోరణితో 2021లో అనారోగ్య కారణాలు చూపించి రాజకీయాలకు గుడ్ బై అనేశారు. అయినా సరే బీజేపీకి రజనీకాంత్ మీద ఆశలు చావలేదు.
ఈ మధ్య కాలంలో వరస ఫ్లాప్స్తో సతమతం అయిన రజనీ ఒకే ఒక్క మూవీతో తిరిగి సూపర్ ఫామ్లోకి వచ్చేశారు. జైలర్ మూవీతో రికార్డులు తిరగరాశారు. దీంతో రజనీలో స్టామినా ఇంకిపోలేదని బీజేపీ సహా అందరూ మరోసారి ఆయన వైపు చూడడం మొదలెట్టేశారు. రజనీ ఈ మధ్యనే పలువురు రాజకీయ ప్రముఖులను కూడా కలుసుకుని వచ్చారు. అందులో కీలకం యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ. ఆయన బీజేపీ సీఎం. ఆయనకు రజనీ పాదాభివందనం కూడా చేశారు. దీని మీద పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. కానీ రజనీ ఆధ్యాత్మికతతోనే ఇదంతా చేశారని ఆయన అభిమానులు సర్దిచెప్పుకున్నారు. అయితే రజనీకాంత్ బీజేపీ నేతలను వరసబెట్టి కలవడం వెనక ఆయన పరోక్ష రాజకీయ ఎంట్రీ ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
దానికి మరింత బలం చేకూర్చేలా రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ తాజాగా మీడియా ముందు చేసిన సంచలన వ్యాఖ్యలు తమిళనాడు మొత్తం వైరల్ అయ్యాయి. తన సోదరుడు రజనీకాంత్ త్వరలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా బాధ్యతలు స్వీకరించవచ్చని ఆయన అనడంతో రజనీ, బీజేపీ బంధం మరోసారి తమిళ రాజకీయాలలో చర్చకు దారితీసింది. పైగా రజనీకాంత్ సొంత సోదరుడు చేసిన ఈ ప్రకటన ప్రజల దృష్టిని ఆకర్షించింది.
యోగి ఆదిత్యనాథ్తో రజనీకాంత్ సమావేశం కావడమే బీజేపీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా ఇప్పటికే మీడియా కోడై కూస్తోంది. అదే టైమ్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను రాష్ట్ర గవర్నర్గా నియమించవచ్చని ఊహాగానాలు ఇపుడు మరింత హీట్ని పెంచుతున్నాయి. బీజేపీకి సౌతిండియా చాలా కీలకం అయిన వేళ ఎన్నికల ప్రచారానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ తారలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తోంది. ఈ వ్యూహానికి అనుగుణంగానే రజనీకాంత్ను గవర్నర్గా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ను గవర్నర్గా నియమించడమనే కీలకమైన ఎత్తుగడతో సౌతిండియాలో బీజేపీ ముందుకు సాగాలని చూస్తోంది. ఒక విధంగా రజనీకాంత్ సినీ క్రేజ్తోపాటు ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాలు ఆయన జీవనశైలి ఇవన్నీ బీజేపీ తమిళనాట పాతుకుపోవడానికి కారణం అవుతాయని, అందుకే జైలర్ రజనీని కాస్తా గవర్నర్ రజనీగా చేయాలని బీజేపీ చూస్తోందని సమాచారం. మరి దీనికి సంబంధించిన ప్రకటన తొందరలోనే రానుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE