అనంతపురం జిల్లా అంటే ముందుగా గుర్తుకొచ్చేది జేసీ బ్రదర్స్. 1978 నుంచి జేసీ దివాకర్రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ జమానాలో జిల్లాను జేసీ శాసించారు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ జరిగే ప్రతి చిన్న విషయం ఆయన కనుసన్నలలోనే జరిగేది. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పని ఖతం కావడంతో జేసీ బ్రదర్స్ టీడీపీలోకి జంప్ అయ్యారు. 2014లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం నుంచి ఎంపీగా, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకరరెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా అయిదేళ్ల పాటు హవా చలాయించారు.
అయితే.. 2019లో మొత్తం జేసీ ఫ్యామిలీ రాజకీయ జాతకం తిరగబడింది. జేసీ బ్రదర్స్ తమ వారసులను బరిలోకి దించారు. వారిని రాజకీయంగా గెలిపించి తాము విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. అలా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిని అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్లతో పోటీకి నిలబెట్టారు. అయితే జగన్ వేవ్లో వారసులు ఇద్దరూ ఓటమిని చవి చూశారు.
ఇక ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న వేళ జేసీ బ్రదర్స్కి టీడీపీలో టికెట్ల ఇక్కట్లు స్టార్ట్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఈసారి అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ ఇస్తా అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అది కూడా తాడిపత్రి అసెంబ్లీ సీటు మాత్రమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ జేసీ ప్రభాకరరెడ్డి కానీ ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి కానీ పోటీ చేస్తారని అంటున్నారు. మరి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి అనంతపురం టికెట్ ఇస్తారా..? అన్నదే ఇప్పుడు డౌట్గా ఉంది.
మరోవైపు అనంతపురం ఎంపీ సీటుకు ఇంచార్జిగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుని చంద్రబాబు నియమించేశారని అంటున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలో పార్టీ పనులన్నీ ఆయనే చూసుకుంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుని ఎంపీగా దించాలని టీడీపీ భావిస్తోంది. బీసీ కార్డుతోనే 2019 ఎన్నికల్లో వైసీపీ ఈ సీటుని సొంతం చేసుకుంది. దీంతో టీడీపీ కూడా బీసీలకే ఈ సీటు ఇవ్వాలని చూస్తోంది. ఇదే కనుక జరిగితే.. జేసీ బ్రదర్స్కి చుక్కెదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా జేసీ పవన్కి పోటీ చేసేందుకు సీటే లేకుడా పోయిందనే చర్చ నడుస్తోంది. ఇక ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి ఏం చేస్తారో అన్న చర్చ కూడా జిల్లాలో మొదలైపోయింది.
ఇంకోవైపు చూస్తే తాడిపత్రి సీటులో జేసీ అస్మిత్ రెడ్డికి బదులు జేసీ ప్రభాకరరెడ్డిని పోటీ చేయమని టీడీపీ అధినాయకత్వం కోరుతున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సీటు చాలా ఇంపార్టెంట్ అని, రిస్క్ చేయలేమని టీడీపీ అధిష్టారం చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో జేసీ బ్రదర్స్ వారసులకు పోటీకి సీట్లు లేవా అన్న విషయంపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేసీ ఫ్యామిలీ ఇప్పుడు ఏం చేస్తుందన్నదే రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE