ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన విజయనగరం లోక్సభ సీటు నుంచి మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ అయిన కిమిడి కళా వెంకటరావుని పోటీ చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కళా వెంకట్రావు మంచి పట్టున్న నేత. ఆయన ప్రాతినిథ్యం వహించిన రాజాం నియోజకవర్గం కొత్త జిల్లాల ఏర్పాటుతో విజయనగరంలో కలసిపోయింది. దీంతో కళాను ఎంపీ క్యాండిడేట్గా పోటీకి దింపితే గెలుపు ఖాయమని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది.
2019 ఎన్నికల్లో ఇదే సీటు నుంచి తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన బెల్లాన చంద్రశేఖర్ వైసీపీ తరఫున విజయం సాధించారు. ఆయన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు బంధువు కూడా. అయితే.. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తూర్పు కాపులు, బీసీలు ఎక్కువ. అదే సామాజికవర్గానికి చెందిన కళాను దించడం ద్వారా సామాజిక సమీకరణలను కూడా సరిచూసుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే విజయనగరం ఎంపీ సీటు మీద పూసపాటి రాజా వారు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆశలు పెట్టుకున్నారు. ఆయన తాను ఎంపీగా మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నారు. అదేవిధంగా తన కుమార్తె, రాజకీయ వారసురాలు అయిన అదితి గజపతిరాజుని విజయనగరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ అధినాయకత్వం అదే చేసింది. అయితే రెండు చోట్లా తండ్రీకూతురు ఓటమి పాలయ్యారు. వైసీపీ ప్రభంజనంలో ఈ పరిణామం జరిగింది. కానీ ఈసారి పరిస్థితులలో మార్పు కనిపిస్తోంది. కాబట్టి కచ్చితంగా రెండు సీట్లూ గెలుచుకుంటామని రాజా వారు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అశోక్గజపతిరాజుని ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరారని అంటున్నారు. అయితే తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన అడిగినట్లుగా ప్రచారంలో ఉంది.
కానీ.. చంద్రబాబు మాత్రం కళా వెంకటరావు అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపారని అంటున్నారు. ఆయనను పోటీకి దించితే ఎంపీ సీటుతో పాటు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో కూడా పార్టీ విజయావకాశాలు మెరుగు అవుతాయని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ పరిణామం చూస్తే రాజు గారి కోటలో కళా పాగా వేసినట్లే అని ప్రచారం జరుగుతోంది. నిజానికి శ్రీకాకుళం జిల్లాలోనే దశాబ్దాల పాటు రాజకీయాలు చేస్తూ వచ్చిన కళాను వ్యూహాత్మకంగా బాబు విజయనగరం జిల్లాకు పంపిస్తున్నారని సమాచారం. అక్కడ అచ్చన్న వర్సెస్ కళాగా పాలిటిక్స్ సాగుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఆయనను ఇలా షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. ఇక అశోక్ గజపతి రాజు జిల్లాలో కళా పాతుకుపోతారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ పరిణామాలు అశోక్ బంగ్లాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయని అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE