బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు శనివారం నాడు సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని, రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. సామాజిక సేవ చేయాలనుకుంటే, రాజకీయాల్లో ఉండకుండా కూడా చేయవచ్చని అన్నారు. తనను టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం సహా ఏ పార్టీ పిలవలేదని, ఏ పార్టీలోకి చేరడం లేదని అన్నారు. తాను ఒకే టీం ప్లేయర్ నని, సుదీర్ఘ చర్చల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఢిల్లీలో తనకు కేటాయించిన నివాసాన్ని నెల రోజుల్లో లేదా అంతకంటే ముందే ఖాళీ చేస్తానని చెప్పారు.
పశ్చిమబెంగాల్ కు చెందిన ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014 లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. 2014, 2019 లలో అసన్సోల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా విజయం సాధించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన ప్రభుత్వంలో కేంద్ర పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే 2019లో ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహించారు. అయితే ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణకు ముందు మంత్రి వర్గం నుంచి తప్పించడంతో బాబుల్ సుప్రియో తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు కోల్పోయిన కొన్ని రోజులకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు బాబుల్ సుప్రియో ప్రకటించడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ