దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దేశంలో జూన్ 21, సోమవారం నాడు ఒక్కరోజే 88.09 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఒకరోజు వ్యవధిలో పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ డోసులలో ఇదే అత్యధికం. దీంతో జూన్ 22, మంగళవారం ఉదయం 8 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 28.87 కోట్లు (28,87,66,201) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ముందుగా జూన్ 21, సోమవారం నుంచి దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో కేంద్రీకృత వ్యాక్సిన్ డ్రైవ్ కింద అన్ని వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందజేయనుంది. ఈ కొత్త వ్యాక్సినేషన్ విధానం సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తొలిరోజునే దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రజలకు పెద్దఎత్తున కరోనా వ్యాక్సిన్ వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ