భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటీష్ రచయిత, బుకర్ ప్రైజ్ విన్నర్ సల్మాన్ రష్దీపై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం న్యూయార్క్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజెంటర్ రష్దీని సభికులకు పరిచయడం చేస్తుండగా ఒక దుండగుడు అకస్మాత్తుగా వేదికపైకి దూసుకొచ్చి వెనక నుంచి దాడికి పాల్పడ్డాడు. 10 సెకన్ల పాటు కత్తితో ఆయనను పదేపదే పొడిచాడు. పది నుంచి పదిహేను వరకు రష్దీ కత్తిపోట్లకు గురైనట్లు భావిస్తున్నారు. దీంతో రష్దీ ఒక్కసారిగా రెయిలింగ్ను ఊతంగా పట్టుకుని అలాగే కుప్పకూలిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన సహాయకులు, భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి కింద పడిపోయిన రష్దీకి ప్రథమ చికిత్స అందించి హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1947 జూన్ 19న ముంబైలో జన్మించిన రష్దీ పూర్తి పేరు అహ్మద్ సల్మాన్ రష్దీ. 1980వ దశకం చివర్లో ‘ది సెటానిక్ వర్సెస్’ అనే నవలను రచించిన రష్దీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం వాదులు విరుచుకుపడ్డారు. ఆ నవలను దైవదూషణ పూరిత రచనగా అభివర్ణించిన ఇరాన్ ప్రభుత్వం 1988లో దానిని నిషేధించింది. అప్పటినుంచి ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే గత 20 ఏళ్లుగా రష్దీ అమెరికాలోనే నివసిస్తుండగా ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. 14 నవలలు రచించిన ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మరెన్నో సాహిత్య అవార్డులు అందుకున్నారు. సాహిత్య రంగానికి రష్దీ చేసిన సేవకు గాను బ్రిటన్ రాణి 2007లో ఆయనను ‘నైట్హుడ్’ బిరుదుతో సత్కరించడం గమనార్హం. ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ అనే నవలకు గాను ఆయనకు 1981లో ప్రతిష్టాత్మక ‘బుకర్ ప్రైజ్’ లభించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY