ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టాక ఆయనతో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై వారివురూ చర్చించారు. అలాగే ఆఫ్ఘానిస్థాన్ లో తాజా పరిస్థితులు, పలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ, జో బైడెన్ తో అత్యుత్తమ సమావేశం జరిగిందన్నారు. క్లిష్టమైన ప్రపంచ సమస్యలపై అతని నాయకత్వం ప్రశంసనీయమని చెప్పారు. వివిధ రంగాలలో భారత్ మరియు యూఎస్ఏ సహకారాన్ని మరింతగా పెంచడం మరియు కోవిడ్-19 మరియు వాతావరణ మార్పు వంటి కీలక సవాళ్లను అధిగమించడానికి కలిసి పనిచేయడం గురించి చర్చించామని చెప్పారు.
అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ, ఇరు దేశాల సంబంధాల చరిత్రలో ఈ భేటీ సరికొత్త అధ్యాయమని చెప్పారు. ఈ రెండు దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, క్లిష్టమైన సవాళ్లను స్వీకరించడానికి, కలిసికట్టుగా ఎదుర్కోడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దృడంగా చేసేందుకే ఈ చర్చలని తెలిపారు. మరోవైపు శుక్రవారం క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కూడా జరిగింది. క్వాడ్రిలేటరల్ ఫ్రేమ్వర్క్ లీడర్స్ సమ్మిట్లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పాల్గొన్నారు. క్వాడ్ సమ్మిట్ పై జో బైడెన్ స్పందిస్తూ, భవిష్యత్తు దృష్ట్యా ఒక ఉమ్మడి విజన్ ను పంచుకున్నామని అన్నారు. 21వ శతాబ్దపు కీలక సవాళ్లను ఎదుర్కోవడానికి క్వాడ్ సభ్య దేశాలు కలిసి పనిచేయబోతున్నట్టు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ