బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ బోణి కొట్టింది. శనివారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తోలి టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇండియా 1-0 ఆధిక్యం సాధించింది. ఇక తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో ప్రత్యర్థిపై భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా.. ఆపై స్పిన్నర్లు తిప్పేయడంతో మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు కంగారూల పని పట్టారు. అశ్విన్ 5 వికెట్లు సాధించగా.. జడేజా 2 వికెట్లు దక్కించుకున్నాడు. మహ్మద్ షమీ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. కాగా అశ్విన్కు 5 వికెట్లు తీయడం ఇది 31వ సారి కావడం విశేషం.
దీంతో ఆస్ట్రేలియా 32.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ 25 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మార్నస్ లబుషేన్, డేవిడ్ వార్నర్, అలెక్స్ క్యారీలు పూర్తిగా విఫలమయ్యారు. కాగా అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా ఆస్ట్రేలియాపై 223 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా 70 పరుగులు, అక్షర్ పటేల్ 84 పరుగులు చేయడం తెలిసిందే. చివరలో మహ్మద్ షమీ వేగంగా ఆడి 37 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో యువ సంచలనం టాడ్ మర్ఫీ 7 వికెట్లు పడగొట్టి రికార్డు ప్రదర్శన చేశాడు. సారథి ప్యాట్ కమిన్స్ 2, నాథన్ లియోన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇక జడేజా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల ప్రదర్శన చేయగా.. అశ్విన్ 2 కీలక వికెట్లు తీశాడు.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 400 ఆలౌట్ (రోహిత్ శర్మ -120 పరుగులు, అక్షర్ పటేల్ – 84 పరుగులు, రవీంద్ర జడేజా – 70 పరుగులు; టాడ్ మర్ఫీ 7 వికెట్లు)
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177 ఆలౌట్ (లబుషేన్ – 49 పరుగులు, స్టీవ్ స్మిత్ – 37 పరుగులు; రవీంద్ర జడేజా 5 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 91 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ – 25 పరుగులు; అశ్విన్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు, మహ్మద్ షమీ 2 వికెట్లు)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE