బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య భారత్ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో రెండోరోజైన శుక్రవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సెంచరీ సాధించాడు. ఓపెనర్గా వచ్చిన అతడు 171 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. తద్వారా అన్ని ఫార్మాట్లలో సెంచరీ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. కాగా కెప్టెన్గా రోహిత్ తన మూడో మ్యాచ్లో తొలి సెంచరీ సాధించాడు. అంతకుముందు శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్, దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్ మరియు పాకిస్థాన్కు చెందిన బాబర్ అజామ్ తర్వాత అన్ని ఫార్మాట్లలో సెంచరీ నమోదు చేసిన కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. అయితే మొత్తంగా 43వ సెంచరీ (వన్డేల్లో 30, టీ20ల్లో 4) కావడం గమనార్హం. ఇక ఇది ఆస్ట్రేలియాపై రోహిత్కి తొలి టెస్టు శతకం మరియు కేవలం 21 ఇన్నింగ్స్లలో ఓపెనర్గా ఆరవది. మొత్తంమీద, ఇప్పటివరకు తొమ్మిది సెంచరీలతో 3000 టెస్ట్ పరుగులను సాధించాడు.
ఒకవైపు మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరుగుతున్నా.. రోహిత్ శర్మ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ సెంచరీ చేసే సమయానికి ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ప్రస్తుతం భారత్ స్కోరు.. 180/5గా ఉంది. అయితే భారత్ కోల్పోయిన ఈ ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా బౌలర్ టాడ్ మర్ఫీ తొలి నాలుగు వికెట్లు తీయడం విశేషం. సూర్యకుమార్ వికెట్ సీనియర్ బౌలర్ నాథన్ లియాన్ దక్కించుకున్నాడు. ఇక రోహిత్ శర్మకు అండగా క్రీజులో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి ఇండియాకు ఎంత ఆధిక్యం అందిస్తారని దానిపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అంతకుముందు ఈ ఉదయం రవిచంద్రన్ అశ్విన్ (23 పరుగులు), ఛటేశ్వర్ పుజారా (7 పరుగులు), విరాట్ కోహ్లీ (12 పరుగులు), అరంగేట్రం ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (8 పరుగులు) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు.
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను వణికించిన టీమిండియా స్పిన్నర్లు..
గురువారం ఆరంభమైన ఈ టెస్టు మొదటి రోజు 177 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (5/47), ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (3/42) గింగిరాలు తిరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి ఆ జట్టులోని ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడం విశేషం. దీంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లలో 177 పరుగులకు చాప చుట్టేసింది. ఆ జట్టు బ్యాటర్లలో లబుషేన్ (49), స్మిత్ (37), క్యారీ (36), హ్యాండ్స్కోంబ్ (31) మాత్రమే ఫర్వాలేదనిపించారు. అనంతరం భారత్ రోజు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక భారత్ రెండో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయగలిగితే ఆస్ట్రేలియాపై మ్యాచ్లో పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రా కుర్రాడు కేఎస్ భరత్ బ్యాటింగ్లో సత్తా చాటాలని, తద్వారా రిషభ్ పంత్ గైర్హాజరీలో అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE