దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు వయస్సు పైబడిన వారందరికీ ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ అందించాలని నిర్ణయించింది. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా జూలై 15, 2022 నుండి వచ్చే 75 రోజుల వరకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జూలై 15 నుండి వచ్చే 75 రోజుల వరకు, 18 ఏళ్లు పైబడినవారికీ అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ప్రికాషన్ డోస్ ఉచితంగా ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయా స్పందిస్తూ, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం కోవిడ్-19 కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని మరియు అదనపు భద్రతను జోడిస్తుందని అన్నారు. అర్హులైన వారందరూ తమ ప్రికాషన్ డోస్ వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచించారు.
60 సంవత్సరాలు పైబడినవారికీ ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా ప్రికాషన్ డోస్ అందిస్తుండగా, ఏప్రిల్ 10,2022 నుండి 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే ప్రికాషన్ డోస్ అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 18 ఏళ్లు పైబడిన వారంతా ఇకపై ఉచితంగా ప్రికాషన్ డోస్ పొందనున్నారు. మరోవైపు కేంద్రం ఇటీవలే ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు 9 నెలలు/39 వారాల వ్యవధిని 6 నెలలు/26 వారాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 18 ఏళ్లు పైబడిన వారంతా రెండవ డోస్ తీసుకుని 6 నెలల పూర్తయిన వెంటనే ప్రికాషన్ డోస్ తీసుకునే అవకాశం కలిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY