కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనా దేశంలో కోవిడ్ కలకలం రేపుతోంది. ఇక్కడ ఒక్కరోజే 20 వేలకు పైగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి నమోదైన అత్యధిక రోజువారీ సంఖ్య (20,472 కేసులు) కావటం విశేషం. లాక్డౌన్లో ఉన్నప్పటికీ షాంఘై సిటీలో కరోనా వైరస్ పెరుగుదలను నియంత్రిచలేకపోతున్నారు. చైనా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జీరో-కోవిడ్” వ్యూహం ఏమాత్రం సత్ఫలితాన్నివ్వడం లేదు. రోజు రోజుకూ కేసులు పెరగుదల ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మార్చి వరకు లాక్డౌన్లు, సామూహిక పరీక్షలు మరియు అంతర్జాతీయ ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలతో చైనా రోజువారీ కేసులను నియంత్రించగలిగింది. అయితే ఇటీవలి వారాల్లో రోజుకు వేలమంది ఈ వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
షాంఘై నగరంలో ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇక్కడ ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ఇతర మ్యుటేషన్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనాలో పలు పరిశ్రమలను మూసివేస్తున్నారు. దీని కారణంగా దేశం ఆర్థికంగా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటోంది. అధికారులు వైరస్ ప్రోటోకాల్స్ కఠినంగా అమలు చేస్తుండటంతో నగరాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘై సిటీ జాతీయ స్థాయిలో 80 శాతానికి పైగా కేసులను కలిగి ఉందని నగర అధికారులు వెల్లడించారు. 25 మిలియన్ల మంది ఉన్న ఈ మహానగరంలో ప్రభుత్వం గత వారం నుంచి దశలవారీగా లాక్ చేసింది. లాక్డౌన్లు కొనసాగుతున్నందున తాజా ఆహారం లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఎం చేయాలో అర్ధం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ