ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28, 202 నుంచి ఆగస్టు 8, 2022 వరకు మొత్తం 12 రోజుల పాటుగా కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్నాయి. కామన్ వెల్త్ క్రీడా సంబరం నేడే (జూలై 28, గురువారం) ఘనంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటల నుంచి ఈ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో 72 దేశాలు పాల్గొంటుండగా, 20 క్రీడా విభాగాలలో 280కి పైగా ఈవెంట్లల్లో 5,000లకు పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. గురువారం కేవలం ప్రారంభ వేడుకలే జరగనుండగా, జూలై 29, శుక్రవారం నుంచి క్రీడా సమరం మొదలుకానుంది.
కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభోత్సవ కార్యక్రమం బర్మింగ్హామ్లోని అలెగ్జాండర్ స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకుల మధ్య జరగనుంది. ఈ వేడుకలకు ప్రిన్స్ చార్లెస్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రారంభ వేడుకలు భారత్ లో సోనీ నెట్వర్క్ లో ప్రసారం కానున్నాయి. అలాగే దూరదర్శన్ స్పోర్ట్స్ చానెల్ కూడా ప్రసారం కానున్నాయి. ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తూ, జాతీయజెండా పట్టుకుని ముందుకు నడిపించనున్నారు.
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ ప్రాతినిధ్యం వహించడం ఇది 18వ సారి. ఈసారి భారత్ నుంచి మొత్తం 215 మంది అథ్లెట్లు, 16 క్రీడా విభాగాలకు సంబంధించిన 141 ఈవెంట్లలో పాల్గొంటున్నారు. 107 మంది కోచ్ లు, సిబ్బంది, అధికారులు కూడా ఉన్నారు. 3×3 బాస్కెట్బాల్, బీచ్ వాలీబాల్, నెట్బాల్ మరియు రగ్బీ సెవెన్స్లలో భారత్ పోటీపడడం లేదు. 2018లో ఆస్ట్రేలియా గోల్డ్కోస్ట్లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 64 పతకాలను కైవసం చేసుకుంది.
ముందుగా 72 ఏళ్ల క్రితం 1930లో కామన్ వెల్త్ గేమ్స్ ను ప్రారంభించారు. నాలుగేళ్ళకు ఓసారి జరిగే ఈ గేమ్స్, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో మాత్రమే జరగలేదు. భారత్ ఇప్పటివరకు ఒక్కసారే 2010లో ఈ గేమ్స్ కు ఆతిధ్యమిచ్చింది. మరోవైపు ఇంగ్లాండ్ కామన్ వెల్త్ గేమ్స్ కు ఆతిధ్యమివ్వడం ఇది మూడోసారి. 1934, 2002తో పాటుగా తాజాగా 2022లో కూడా ఇంగ్లాండ్ లోనే ఈ గేమ్స్ జరుగుతున్నాయి.
ఇక మలేషియాలోని కౌలాలంపూర్లో 1998 కామన్వెల్త్ గేమ్స్లో లిస్ట్-ఏ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ జరిగిన తర్వాత కామన్వెల్త్ గేమ్స్-2022లో మళ్ళీ క్రికెట్ను తొలిసారిగా చేర్చారు. అయితే ఈసారి కేవలం మహిళల క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో జరగనున్నాయి. మరోవైపు ఈసారి గేమ్స్ లో షూటింగ్ విభాగం లేదు. దీంతో వెయిట్లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, క్రికెట్, సైక్లింగ్, జూడో, స్క్వాష్, స్విమ్మింగ్, ట్రయథ్లాన్ సహా పలు విభాగాల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటి పతకాల వేట సాగించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY