గతకొన్ని రోజులుగా మహారాష్ట్ర రాష్ట్రంలో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ముఖ్యంగా పూణే, నాగ్పూర్, థానే, ముంబయిలలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాగ్పూర్ లో కరోనా పరిస్థితి కారణంగా మార్చి 15 నుంచి 21 వరకు ఏడురోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నాగ్పూర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు మహారాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో కూరగాయలు, పండ్ల దుకాణాలు మరియు పాల బూత్ లు, మెడికల్ షాపులతో పాటుగా ఇతర అత్యవసర సేవలు అనుమతించబడతాయని పేర్కొన్నారు.
అలాగే నాగ్పూర్ ప్రాంతంలోని మాల్స్ మూసివేయబడతాయని, బహిరంగ కార్యక్రమాలు, వివాహాలు అనుమతించబడవని చెప్పారు. ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయనుండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాలకు అనుగుణంగా కొంత శాతం ఉద్యోగులను అనుమతించనున్నారు. రెస్టారెంట్లు రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయని, హోమ్ డెలివరీ సర్వీసు మాత్రం రాత్రి 10 గంటల వరకు కొనసాగించుకోవచ్చని చెప్పారు. మరోవైపు మహారాష్ట్రలోని అఖోలా, పర్భణి జిల్లాల్లో కూడా లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 22,66,374 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21,06,400 మంది కరోనా నుంచి కోలుకోగా, 52,667 మంది మరణించారు. ప్రస్తుతం 1,06,070 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ