ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా మూడు రోజులపాటు ప్రత్యేక విమానాల్లో భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక ఫెర్రీ విమానం ఈ ఉదయం ఢిల్లీ నుండి ఉక్రెయిన్కు బయలుదేరింది.
200 సీట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన డ్రీమ్లైనర్ B-787 ఎయిర్క్రాఫ్ట్ ప్రత్యేక ఆపరేషన్ కోసం సిద్ధం అయింది. ప్రయణికులను ఎక్కించుకున్న అనంతరం తిరిగి ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకోనుంది. 20,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు మరియు జాతీయులు ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఎయిర్ ఇండియా.. భారతదేశం మరియు ఉక్రెయిన్ మధ్య మూడు వందే భారత్ మిషన్ (VBM) విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఫిబ్రవరి 22, 24 మరియు 26 తేదీల్లో నడుస్తాయి. ఈ విమానాలు ఉక్రెయిన్లోని అతిపెద్ద విమానాశ్రయమైన బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నడుస్తాయి. రష్యాతో విభేదాలు తలెత్తే ప్రమాదం ఉన్నందున తాత్కాలికంగా ఉక్రెయిన్ను విడిచిపెట్టాల్సిందిగా భారత్ తన పౌరులను కోరింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు క్రెమ్లిన్లో తిరుగుబాటు నాయకులతో పరస్పర సహాయం మరియు స్నేహ ఒప్పందాలపై సంతకం చేయడంతో ఉక్రెయిన్పై రష్యా దాడిని నిరోధించే ప్రయత్నాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. “దొనేత్సక్ పీపుల్స్ రిపబ్లిక్ మరియు లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ యొక్క స్వాతంత్య్రం మరియు సార్వభౌమాధికారాన్ని వెంటనే గుర్తించడం కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని పుతిన్ ప్రకటించాడు. ఉక్రెయిన్ మిషన్ను “ఆక్రమణ దళాలు” గా సంబోధిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, తూర్పు ఉక్రెయిన్లో రష్యా గుర్తించిన భూభాగాలపై ఆర్థిక ఆంక్షలను ప్రకటించారు. మంగళవారం కూడా మాస్కోపై ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ