భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ 38వ వర్థంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు, కీలక నేత సోనియా గాంధీ, పలువురు పార్టీ నాయకులు సోమవారం ఉదయం ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ట్వీట్ చేస్తూ, “భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నా నివాళులు. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ లేదా సైనిక శక్తి ఏదైనా సరే, భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడంలో ఇందిరాజీ చేసిన కృషి సాటిలేనిది” అని పేర్కొన్నారు.
మరోవైపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న పార్టీ నేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం ఇందిరా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, ఈ రోజు యాత్రను ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ దేశాన్ని కలుపుతోందని పేర్కొన్నారు.
భారతదేశానికి ఇప్పటివరకు ప్రధానిగా పనిచేసిన ఒకే ఒక మహిళా ఇందిరాగాంధీ. ఆమె రెండు సార్లు దేశానికి ప్రధానిగా పనిచేశారు. ఇందిరా గాంధీ అక్టోబర్ 31, 1984లో ప్రధానిగా ఉన్న సమయంలోనే తనకు భద్రతగా ఉన్న సిబ్బంది జరిపిన దాడిలోనే ఆమె మరణించారు. ఆమె వర్ధంతి సందర్భంగా నేడు భారతదేశ వ్యాప్తంగా పలువురు నాయకులు నివాళులు అర్పించి, దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE